నటుడు జయప్రకాశ్ రెడ్డి మృతికి తెలుగు రాష్ట్రాల సీఎంల సంతాపం

  • గుండెపోటుతో జయప్రకాశ్ రెడ్డి కన్నుమూత
  • జయప్రకాశ్ రెడ్డికి ప్రజల్లోనూ అభిమానం ఉందన్న సీఎం కేసీఆర్
  • చిత్ర పరిశ్రమలో ఆయనది ప్రత్యేకస్థానమని పేర్కొన్న సీఎం జగన్
టాలీవుడ్ సీనియర్ నటుడు జయప్రకాశ్ రెడ్డి మృతి పట్ల తెలుగు రాష్ట్రాల సీఎంలు కేసీఆర్, జగన్ సంతాపం వ్యక్తం చేశారు. అనేక సినిమాల్లో విభిన్న పాత్రల్లో నటించిన మంచి నటుడిగానే కాకుండా, గొప్ప రంగస్థల నటుడిగా కూడా జయప్రకాశ్ రెడ్డికి ప్రజల్లో అభిమానం ఉందని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు.

అటు, ఏపీ సీఎం స్పందిస్తూ జయప్రకాశ్ రెడ్డి మూడు దశాబ్దాల సినీ జీవితంలో వైవిధ్యమైన పాత్రలు, తనదైన విలక్షణ నటనతో చిత్ర పరిశ్రమలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారని కీర్తించారు. ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

ప్రతినాయకుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, కమెడియన్ గా ఇండస్ట్రీలో తనకంటూ ఓ శైలి ఏర్పరచుకున్న జయప్రకాశ్ రెడ్డి ఈ ఉదయం గుండెపోటుతో హఠాన్మరణం చెందడం తెలిసిందే.

KCR
Jagan
Jayaprakash Reddy
Demise
Tollywood

More Telugu News